అమరావతి/కడప జిల్లా
ఆంధ్రప్రదేశ్ డిజిపికి టిడిపి అధినేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు లేఖ
వైసిపి అవినీతిని బైటపెట్టినందుకే సిఆర్ పిఎఫ్ మాజీ కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డి హత్య.
– గండికోట పరిహారం చెల్లింపులో అక్రమాలు బైటపెట్టాడనే కక్షతోనే గురుప్రతాప్ రెడ్డి హత్య
– నిందితులను కఠినంగా శిక్షించాలని డిజిపికి లేఖలో చంద్రబాబు డిమాండ్
★ పేదలను హింసించడం, మరీ ముఖ్యంగా హతమార్చడం రాష్ట్రంలో సర్వ సామాన్యంగా మారడం ఆందోళన కలిగిస్తోంది.
★ ఒకవైపు నేరాల సంఖ్య రోజురోజుకూ మితిమీరిపోతున్నా, శాంతిభద్రతలు గణనీయంగా క్షీణిస్తున్నా, భయానక నేరాలపై కూడా దృష్టిపెట్టక పోవడం గర్హనీయం.
★ హింసాత్మక యంత్రాంగాన్ని, అల్లకల్లోలం చేసే యంత్రాంగాన్ని అధికార వైసిపి నెలకొల్పినట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే అనిపిస్తోంది.
★ అధికారపార్టీ అవినీతిపై ప్రశ్నించినవారిని లక్ష్యంగా చేసుకుని వేధించడం, హింసించడమే కాకుండా, హత్యలు కూడా చేస్తున్నారు.
★ అధికార పార్టీ అవినీతి కుంభకోణాలు బైటపెట్టారనే కక్షతో ఆ సమాచారం వెల్లడించిన వారిని( విజిల్ బ్లోయర్స్) లక్ష్యంగా చేసుకోవడం, హతమార్చడం అతిదారుణం.
★ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపూర్ మండలం పెంజిఅనంతవరంకు చెందిన గురు ప్రతాప్ రెడ్డి (47)గతంలో సిఆర్ పిఎఫ్ లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశాడు.
★ గ్రామంలో ఇసుక రీచ్ లో అక్రమాలను, గండికోట ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం చెల్లింపుల్లో అవినీతిని గమనించాడు.
★ ఒక్కో కుటుంబానికి రూ10లక్షల చొప్పున 677కుటుంబాలకు పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
★ కానీ ఆ గ్రామంలోని కుటుంబాల సంఖ్య సుమారు 350మాత్రమే కాగా, ముంపు కుటుంబాల సంఖ్యను కావాలనే 677కు పెంచేసి, తద్వారా అదనపు సొమ్ము స్వాహాకు తెరదీశారు.
★ మాజీ సిఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ అయిన ప్రతాప్ రెడ్డి ఈ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ తో సహా రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
★ ఈ అవినీతి అక్రమాలపై నిజానిజాల నిర్ధారణకు డిప్యూటి కలెక్టర్ రోహిణి ఇద్దరు తహశిల్దార్లతో సహా 13నవంబర్ 2020న గ్రామసభను నిర్వహించారు.
★ పరిహారం చెల్లింపు జాబితాలో సుమారు 300మంది అనర్హుల పేర్లు చేర్చారని గురు ప్రతాప్ రెడ్డి గ్రామసభలో చెప్పేటప్పుడే ఇందులోని ప్రధాన నిందితులు తమ అనుచరులతో సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు, అంతరాయాలు కల్పించారు.
★ ఈ అక్కసు మనసులో పెట్టుకునే గురుప్రతాప్ రెడ్డిపై కక్షతో ఎక్కడైతే గ్రామసభ జరిగిందో అదే ఆలయంలో గురుప్రతాప్ రెడ్డిని కిరాతకంగా హత్య చేశారు.
★ ఈ హత్యను ఫాక్షన్ హత్యల్లో భాగంగా ప్రభుత్వమే చిత్రించాలని చూస్తోంది, కానీ వాస్తవానికి ఈ హత్య అవినీతి కుంభకోణాన్ని వెల్లడించడం వల్ల జరిగిన హత్య, ప్రజాధనం భారీఎత్తున స్వాహా చేయడాన్ని బైటపెట్టడం వల్ల జరిగిన హత్య.
★ గురుప్రతాప్ రెడ్డి ఒక విజిల్ బ్లోయర్ గా గండికోట రిజర్వాయర్ ముంపు బాధితుల పరిహారం చెల్లింపులో జరిగిన అవినీతి కుంభకోణాన్ని బైటపెట్టి బాధ్యతగల పౌరుడిగా దేశం పట్ల తన విధి నిర్వర్తించాడు.
★ అవినీతి కుంభకోణాల్లో హత్యలు కూడా జరిగేస్థాయికి వచ్చిందంటే, ఇక రాష్ట్రంలో నేరాలు-ఘోరాలు ఏ స్థాయికి చేరాయో ఎవరైనా అర్ధం చేసుకోవచ్చు.
★ విజిల్ బ్లోయర్ గా తన కళ్లెదుట జరిగే అవినీతిని బైటపెట్టిన ఒక మాజీ సిఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ నే హతమార్చారంటే రాష్ట్రంలో అవినీతి మూకలు ఏ స్థాయిలో రాజ్యమేలుతున్నాయో తెలుస్తోంది.
★ గురుప్రతాప్ రెడ్డి దేశం కోసం సిఆర్ పిఎఫ్ లో ధైర్యంగా పని చేసినప్పటికీ, మనరాష్ట్రంలో అవినీతిపై పోరాడినందుకు, అక్రమాలు బైటపెట్టినందుకు హత్యకు గురయ్యాడు.
★ విజిల్ బ్లోయర్స్ ను, అవినీతిని నిగ్గదీసేవాళ్లను ఈవిధంగా వేధింపులకు గురిచేయడం, హతమార్చడం, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా (చట్టబద్ద పాలన)పై ప్రజల విశ్వాసాన్ని గండికొట్టడమే..
ఈ నేపథ్యంలో, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నిలబెట్టడం, ప్రజల్లో పోయిన విశ్వాసాన్ని పాదుగొల్పడం ప్రస్తుత తరుణంలో అత్యంత అవశ్యకం.
★ ఏపి విజిలెన్స్ కమిషనర్ కు, ఏసిబి డైరెక్టర్ జనరల్ కు దీని నకళ్లు తగిన చర్యల నిమిత్తం పంపడం జరిగింది.